పవన్ కళ్యాణ్ ఎక్కడ....?

ఏపీ రాజకీయం వేడెక్కిపోతోంది. అటు కోర్టులలో న్యాయ పోరాటం సాగుతూంటే ఇటు అసెంబ్లీలో రాజకీయ పోరాటం వైసీపీ వర్సెస్ టీడీపీ అన్నట్లుగా సాగుతోంది

Sep 23, 2023 - 15:08
 0
పవన్ కళ్యాణ్ ఎక్కడ....?

మనభారత్ న్యూస్, 23 సెప్టెంబర్ 2023, ఆంధ్రప్రదేశ్ :  ఏపీ రాజకీయం వేడెక్కిపోతోంది. అటు కోర్టులలో న్యాయ పోరాటం సాగుతూంటే ఇటు అసెంబ్లీలో రాజకీయ పోరాటం వైసీపీ వర్సెస్ టీడీపీ అన్నట్లుగా సాగుతోంది. మరో వైపు చూస్తే వీధి పోరాటాలతో టీడీపీ తమ్ముళ్లు బిజీగా ఉన్నారు. చంద్రబాబు రిమాండ్ కి వెళ్ళిన మూడవ రోజునే షూటింగ్ కి విరామం ప్రకటించి మరీ రాజమండ్రికి ప్రత్యేక విమానంలో వచ్చిన పవన్ కళ్యాణ్ నేరుగా బాబు ఉన్న జైలులోకి వెళ్లి అక్కడ ఆయనతో ములాఖత్ అయ్యారు.

ఆ తరువాత హడావుడిగా బయటకు వచ్చి టీడీపీతో పొత్తు ఖాయమని చెప్పారు. ఈ రోజు నుంచి జనసేన టీడీపీ కలసి ఉమ్మడిగా ముందుకు సాగుతాయని కూడా చెప్పారు. రెండు పార్టీలు ఉమ్మడి కార్యాచరణ రూపొందిస్తాయని కూడా ఆయన వెల్లడించారు. ఆ వెంటనే మంగళగిరి పార్టీ ఆఫీసులో జనసేన మీటింగ్ పెట్టి మరీ టీడీపీ పొత్తులకు ఆమోద ముద్ర వేయించారు.

ఇక టీడీపీతో ఉమ్మడి కార్యాచరణ కోసం నాదెండ్ల మనోహర్ నాయాక్త్వంలో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లుగా జనసేన ప్రకటించినట్లుగా వార్తలు వచ్చాయి. ఇవన్నీ జరిగి వారం దాటుతోంది. అసలు ఉమ్మడి కార్యాచరణ ఏది అన్నది ఇపుడు ప్రశ్నగా ఉంది. జనసేన సైడ్ నుంచి చూస్తే లోకల్ గా కొన్ని చోట్ల టీడీపీ వారితో పాటు ఆ పార్టీ క్యాడర్ అయితే నిరసనలో పాలుపంచుకుంటోంది

అంతే తప్ప రెండు పార్టీల పెద్ద నాయకులు కూర్చుని స్టేట్ వైడ్ ప్రోగ్రాం అయితే చేపట్టినది లేదు. నిజానికి చంద్రబాబు అరెస్ట్ అయి శనివారానికి పదిహేను రోజులు కావస్తోంది. టీడీపీ చేస్తున్న ఆందోళనలు జనాలకు అనుకున్న స్థాయిలో రీచ్ కావడంలేదు. ఇంకో వైపు చూస్తే పవన్ కళ్యాణ్ క్రిష్ణా జిల్లాలో వారాహి యాత్ర మూడవ విడత ఈ నెల 21 నుంచి స్టార్ట్ చేస్తారు అని వార్తల్ సైతం వచ్చాయి.

మరి అవన్నీ ఏమయ్యాయో తెలియదు కానీ చాలా కీలకమైన టైంలో హాట్ హాట్ గా ఏపీ పాలిటిక్స్ ఉన్న టైం లో పవన్ కళ్యాణ్ అయితే సీన్ లో కనిపించకపోవడం పట్ల చర్చ అయితే జోరుగా సాగుతోంది. స్టేట్ మొత్తం మీద వేడెక్కిపోతున్న రాజకీయం వేళ పవన్ గొంతు ఎక్కడా వినిపించకపోవడం పట్ల కూడా వాడిగా వేడిగా చర్చ సాగుతోంది.

ఇంతకీ ఈ కీలకమైన టైం లో పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారు అన్నది చర్చకు వస్తోంది. పవన్ కళ్యాణ్ ఈ టైం లో టీడీపీకి అండగా ఉంటే పాలిటిక్స్ వేరే లెవెల్ లో ఉండేది అని అంటున్న వారూ ఉన్నారు. అయితే ఉమ్మడి కార్యాచరణ కోసం మాట్లాడాల్సిన పెద్దలు టీడీపీలో ఎవరు అన్న డౌట్లు కూడా జనసేనలో ఉన్నాయని అంటున్నారు.

నారా లోకేష్ ఇప్పటికి పది రోజులుగా ఢిల్లీలో ఉన్నారు, ఆయన అక్కడే గడుపుతున్నారని ఇంకా మరికొన్ని రోజులు ఉంటారని అంటున్నారు. అందువల్ల లోకేష్ వస్తేనే కానీ ఉమ్మడి కార్యాచరణ అన్నది ముందుకు సాగదని చెబుతున్నారు. మరో వైపు చూస్తే టీడీపీలో కూడా ఎవరికి వారుగా పెద్ద నాయకులుగా ఫోకస్ అవుతున్నారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడి హోదాలో అచ్చెన్నాయుడు ఉన్నా ఆయన అధికారాలు పరిమితమే అంటున్నారు. అలాగే యనమల రామక్రిష్ణుడు బాబుతో ములాఖత్ అయ్యాక బయటకు వచ్చి పోరాటం చేస్తామని అన్నారు. ఆ తరువాత ఆయన వైపు నుంచి కూడా పార్టీకి సరైన డైరెక్షన్స్ వచ్చాయా అన్నది డౌట్ గా ఉంది.

ఏది ఏమైనా ఏపీ అయితే రాజకీయంగా మరుగుతోంది. ఎన్నికలు దగ్గరలో ఉన్న వేళ ఏపీ బాబు అరెస్ట్ తో వైసీపీ వర్సెస్ టీడీపీగా మారితే జనసేన అధినేత ఈ కీలక టైం లో జనంలోకి వస్తే ఆ కిక్కే వేరుగా ఉంటుందని అంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ మదిలో ఏముందో జనసేన ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలియడంలేదు అంటున్నరు. ఏది ఏమైనా పవన్ ఎక్కడా అన్న ప్రశ్నలు అయితే వినిపిస్తున్నాయి. టీడీపీ న్యాయపోరాటాన్ని నమ్ముకుందని ఆ తరువాతనే రాజకీయ పోరాటం ముమ్మరం చేస్తుందని అంటున్నారు. చూడాలి మరి అప్పటికి పవన్ ఏపీ సీన్ మీద కనిపిస్తారేమో.


What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

Hameed Shaik మనభారత్ న్యూస్