సీఐడీ ముందు చంద్రబాబు

జరుగుతున్నది, జరగబోయేది ఇదే?

Sep 23, 2023 - 15:02
 0
సీఐడీ ముందు చంద్రబాబు

మనభారత్ న్యూస్, 23 సెప్టెంబర్ 2023, ఆంధ్రప్రదేశ్ : స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబుకు శుక్రవారం వరుస షాకులు తగిలాయనే కామెంట్లు వినిపించిన సంగతి తెలిసిందే. వాటిలో సీఐడీ తమ కస్టడీకి కోరుతూ వేసిన పిటిషన్ ని ఏసీబీ కోర్టు అనుమతించడం ఒకటి. దీంతో చంద్రబాబును సీఐడీ అధికారులు రెండు రోజులు పాటు విచారించనున్నారు. ఈ క్రమంలో వైద్య పరీక్షల అనంతరం చంద్రబాబు, సీఐడీ అధికారుల ముందు హాజరయ్యారు!

శనివారం ఉదయం తాడేపల్లి సిట్ కార్యాలయం నుండి బయల్దేరిన సీఐడీ అధికారులు.. ల్యాప్ టాప్, ప్రింటర్, సహా పలు డాక్యుమెంట్స్ వెంట తీసుకుని రాజమండ్రి చేరుకున్నారు. ప్రస్తుతం సీఐడీ డీఎస్పీ ధనుంజయుడు నేతృత్వంలో విచారణ ప్రారంభమైందని సమాచారం. ఈ విచారణలో ముగ్గురు డీఎస్పీలు, నలుగురు సీఐలు, ఒక ఏఎస్సై, ఒక కానిస్టేబుల్ పాల్గొన్నారు! వీరితో పాటు ఒక వీడియోగ్రాఫర్‌, ఇద్దరు మధ్యవర్తులు (ఎమ్మార్వో – వీఆర్వో) ఉన్నారని తెలుస్తుంది.

కోర్టు ఇచ్చిన రెండు రోజులులో ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5 గంటలవరకూ బాబును సీఐడీ అధికారులు విచారించనున్నారు. అంటే మొత్తం 15 గంటలపాటు సీఐడీ అధికారులకు బాబు నుంచి సమాచారం రాబట్టేందుకు సమయం ఉంది. ఈ విచారణలో బాబుతో పాటు ఆయన తరుపు న్యాయవాదులు ఆరుగురు సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది. ఇక ప్రతీ గంటకూ ఐదు నిమిషాల బ్రేక్ తో పాటు మధ్యాహ్నం 1 - 2 గంటల వరకూ లంచ్ విరామం ఉంటుంది.

ఇదే సమయంలో బాబు ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకోవడం, అడిగినప్పుడల్లా అవసరం మేరకు విరామం ఇవ్వడం సీఐడీ అధికారుల బాధ్యత అని తెలుస్తుంది. అలా అని పూర్తిగా దాటవేత దోరణిలో బాబు కొనసాగితే.. విచారణకు సహకరించలేదనే కారణంతో... వీడియోలు చూపించి సీఐడీ కస్టడీ పొడిగింపుకు కోర్టును అనుమతికోరే అవకాశం ఉందని అంటున్నారు.

అయితే చంద్రబాబును సీఐడీ కస్టడీకి ఇచ్చే సమయంలో కోర్టు, సీఐడీ అధికారులకు మరికొన్ని ఆదేశాలు జారీచేసింది. ఇందులో భాగంగా... చంద్రబాబుపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించరాదని, ఎలాంటి తీవ్రమైన చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. కస్టడీకి తీసుకునే ముందు, కస్టడీ ముగిసిన తర్వాత ఆయనకు తప్పనిసరిగా వైద్యపరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది.

అదేవిధంగా... విచారణను సీఐడీకి చెందిన వీడియోగ్రాఫర్‌ తో మాత్రమే రికార్డు చేయించాలని, ఆ వీడియో మొత్తాన్ని సీల్డ్‌ కవర్‌ లో న్యాయస్థానానికి సమర్పించాలని పేర్కొంది. ఇదే క్రమంలో కస్టడీ గడువు ముగిసిన తర్వాత ఆదివారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా చంద్రబాబును న్యాయస్థానం ఎదుట హాజరుపరచాలని ఆదేశించింది.

బాబును విచారించే సీఐడీ టీం ఇదే:

రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబును విచారించేందుకు 12 మందితో కూడిన టీం ని సీఐడీ సిద్ధం చేసింది. వారి పేర్లతో కూడిన జాబితాను ఏసీబీ న్యాయస్థానానికి సమర్పించారు. వీరిలో సీఐడీ డీఎస్పీలు - ఎం.ధనుంజయుడు, వి విజయ్‌ భాస్కర్‌, ఎ లక్ష్మీనారాయణ.. ఇన్‌ స్పెక్టర్లు - ఎన్‌.ఎల్‌.వి. మోహన్‌ కుమార్‌, వై రవికుమార్‌, ఐ శ్రీనివాసన్‌, సీహెచ్‌. సాంబశివరావు, ఏఎస్సై పి.రంగనాయకులు, కానిస్టేబుల్‌ ఎం సత్యనారాయణ సీఐడీ తరుపున విచారణలో పాల్గొంటారు.


What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

Hameed Shaik మనభారత్ న్యూస్