తెలంగాణ రాజధానికి మరో మణిహారం.. త్వరలో ప్రారంభించనున్న కేసీఆర్

May 6, 2023 - 18:11
May 6, 2023 - 20:36
 0
తెలంగాణ రాజధానికి మరో మణిహారం.. త్వరలో ప్రారంభించనున్న కేసీఆర్

మనభారత్ న్యూస్, 06 మే 2023, తెలంగాణ : జూన్ నెలలో తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు! తెలంగాణ ప్రజల హృదయాలను కదిలించే ఈ భవనాన్ని పూర్తి చేయాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధికారులు, ఏజెన్సీ సిబ్బందిని ఆదేశించారు.

ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని అన్నారు. నిర్ణీత గడువులోగా ప్రారంభానికి అంతా సిద్ధం చేయాలని చెప్పారు. నిర్మాణ ప్రాంతమంతా సందర్శించి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వచ్చే నెలలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా అమరజ్యోతిని ప్రారంభించనున్నట్లు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు.

హుస్సేన్ సాగర్ ఒడ్డున తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపాన్ని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అమరజ్యోతి ప్రాంగణాన్ని సందర్శించి క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించారు. ప్రధాన ద్వారం, ల్యాండ్‌స్కేప్ ఏరియా, పార్కింగ్ ఏరియా, తెలంగాణ తల్లి విగ్రహం, ఫౌంటెన్ ఏరియా, గ్రానైట్ ఫ్లోరింగ్, ఫోటో గ్యాలరీ, ఆడియో, విజువల్ రూమ్, లిఫ్టులు, ఎస్కలేటర్, కన్వెన్షన్ సెంటర్, పై అంతస్తులో రెస్టారెంట్, నిత్యం మండుతున్న జ్యోతి ఆకారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అధికారులకు, నిర్మాణ సంస్థకు సీఎం కేసీఆర్ పలు సూచనలు చేశారు.

తెలంగాణ అమరవీరుల త్యాగాలను ప్రతిబింబించేలా హైదరాబాద్ నగరం నడిబొడ్డున హుస్సేన్ సాగర్ ఒడ్డున ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నిర్మాణానికి శ్రీకారం చుట్టారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. అన్ని రకాల అధునాతన సాంకేతికతతో, అరుదైన స్టెయిన్‌లెస్ స్టీల్‌తో మెమోరియల్‌ని అన్ని హంగులతో నిర్మించామని తెలిపారు. అరుదైన స్టెయిన్‌లెస్ స్టీల్‌తో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద భవనం ఇదేనని తెలిపారు. ఒక్కసారి ఈ నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వస్తే ప్రపంచం అబ్బురపడుతుందని అంటున్నారు. స్మారక ప్రాంగణానికి ఎవరు వచ్చినా అమరవీరుల త్యాగాలను స్మరించుకునేలా ఈ నిర్మాణంలో ఏర్పాట్లు చేయబోతున్నామని తెలిపారు.

తెలంగాణ ప్రజలందరి హృదయాలను హత్తుకునేలా అధికారులు, వర్క్ ఏజెన్సీలు కృషి చేయాలని కోరారు. ల్యాండ్‌స్కేప్ ఏరియాలో పచ్చదనానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఆహ్లాదకరమైన రంగురంగుల పూల మొక్కలను ఏర్పాటు చేయాలని సూచించారు. నిర్మాణ పనులు వేగవంతం చేయాలని, చార్ట్ ప్రకారం పనులు పూర్తి చేసి కేసీఆర్ నిర్దేశించిన నిర్ణీత గడువులోగా ప్రారంభానికి సిద్ధం చేయాలని ఆదేశించారు. అందుకు అనుగుణంగా మ్యాన్ పవర్ పెంచాలని కోరారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

Hameed Shaik మనభారత్ న్యూస్