కరోనా కంటే నిఫా వైరస్ అత్యంత ప్రమాదకరం

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐసీఎంఆర్ హెచ్చరిక

Sep 17, 2023 - 12:42
 0  18
కరోనా కంటే నిఫా వైరస్ అత్యంత ప్రమాదకరం

మనభారత్ న్యూస్, 17 సెప్టెంబర్ 2023, కేరళ (మనభారత్ ప్రతినిథి) :  కేరళలో నిఫా వైరస్ వెలుగుచూడటం ఆందోళన కలిగిస్తుంది.ఇప్పటికే ఈ వైరస్ ఐదుమందికి సోకగా..అందులో ఇద్దరు మృతి చెందారు. ఈ నేపథ్యంలోనే భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) హెచ్చరికలు జారీ చేసింది. కరోనా వైరస్‌తో పోల్చితే..నిఫా వైరస్ అత్యంత ప్రమాదకరమైనదని తేల్చి చెప్పింది.కొవిడ్ సోకిన వారిలో 2 – 3 శాతం మరణాలు ఉండగా..నిఫా వైరస్ వల్ల 4–70 శాతం మరణాలు ఉన్నాయని చెప్పింది. ప్రస్తుతం కేరళలో కేసులు ఎందుకు పెరుగుతున్నాయో తెలియడం లేదని..నిఫా వైరస్‌ను అదుపు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని..ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ రాజీవ్‌ బహల్‌ పేర్కొన్నారు.ప్రస్తుతం ఐసీఎంఆర్‌ వద్ద 10 మంది రోగులకు సరిపడేలా మోనోక్లీనల్‌ యాంటీబాడీ మందు అందుబాటులో ఉంది. అలాగే మరో 20 డోసుల మందును ఆస్ట్రేలియా నుంచి కొనుగోలు చేస్తామని పేర్కొన్నారు.

భారత్‌లో ఇప్పటిదాకా..

నిఫా వైరస్‌ సోకిన వారిలో ఒక్కరికి కూడా ఇంతవరకు మోనోక్లీనల్‌ యాంటీబాడీల మందు ఇవ్వనేలేదు. వాస్తవానికి ఇన్ఫెక్షను ప్రారంభ దశలో ఉన్నపుడే ఈ మందు వినియోగించాలన్నారు.ఇదిలా ఉండగా..ఈ నిఫా వైరస్‌ అనేది గబ్బిలాల నుంచి మనుషులకు వ్యాపించినట్లు 2018లో గుర్తించారు.అయితే ఈ వ్యాధి గబ్బిలాల నుంచి అసలు ఎలా వ్యాప్తి చెందుతుందో కచ్చితంగా చెప్పలమని పేర్కొన్నారు. ఇప్పటిదాకా విదేశాల్లో ఉన్న 14 మంది నిఫా రోగులకు మోనోక్లోనల్‌ యాంటీబాడీ మందును ఇచ్చినట్లు తెలిపారు. అయితే ఇప్పుడు వారంతా సురక్షితంగా బయటపడినట్లు వెల్లడించారు. మరోవైపు నిఫా వైరస్ వర్షాకాలంలో ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నట్లు డాక్టర్ రాజీవ్ బహల్ తెలిపారు. ఈ వైరస్‌ బారిన పడకుండా ఉండాలంటే..చేతులు శుభ్రంగా కడుక్కోవాలని..మాస్క్‌ను కచ్చితంగా ధరించాలని కోరారు.అలాగే అటవీ ప్రాంతాలకు దగ్గరగా నివసించేవారు జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్యమంతి వీణా జార్జ్ సూచనలు చేశారు.

మరోవైపు కేరళలో నిఫా వైరస్ కేసులు పెరగడం కలకలం రేపుతోంది.ఇప్పుడు తాజాగా కోజికోడ్ లోని 39 ఏళ్ల వ్యక్తికి ఈ వైరస్ సోకింది.అయితే ఆగస్టు 30వ తేదిన నిఫా వల్ల మరణించిన వ్యక్తితో సన్నిహితంగా ఉండటం వల్లే ఇతనికి ఈ వైరస్ సోకినట్లు వీణా జార్జ్ తెలిపారు.ప్రస్తుతం ఇతను ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.దీంతో నిఫా వైరస్ కేసుల సంఖ్య ఆరుకి చేరుకుంది.వీరిలో ఇద్దరు మృతి చెందగా..యాక్టివ్ కేసుల సంఖ్య నాలుగుగా ఉంది.

ఇదిలా ఉండగా..

కోజికోడ్ జిల్లాలో శనివారం కూడా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.అలాగే నిఫా వైరస్ వ్యాప్తి ఉన్న నేపథ్యంలో కర్ణాటక,తమిళనాడు రాష్ట్రాలు కూడా అప్రమత్తమయ్యాయి.వైరస్‌ను కట్టడి చేసేందుకు పరీక్షలు పెంచుతూ అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వీణా జార్జ్ తెలిపారు.కేరళ మొత్తం ఇలాంటి ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశం ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్యసంస్థ,ఐసీఎంఆర్‌ అధ్యయనాల్లో వెల్లడైనట్లు పేర్కొన్నారు.ఇదిలా ఉండగా..మరోవైపు ఇప్పటికే కోజికోడ్‌ చేరుకున్న కేంద్ర నిపుణుల బృందం నిఫా వైరస్‌పై అధ్యయనాలు చేస్తోంది

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

Hameed Shaik మనభారత్ న్యూస్